‘నీది నాది ఒకే కథ’ లాంటి గొప్ప చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన దర్శక నిర్మాతలకు హ్యాట్సాఫ్‌ – థాంక్స్‌ మీట్‌లో ప్రముఖ దర్శకులు

‘అప్పట్లో ఒకడుండేవాడు’లాంటి డిఫరెంట్‌ చిత్రాన్ని నిర్మించిన ఆరాన్‌ మీడియా వర్క్స్‌ సంస్థ లేటెస్ట్‌గా ‘నీది నాది ఒకే కథ’ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. సింపుల్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ హానెస్ట్‌ కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

రోహిత్‌ సమర్పణలో వేణు ఊడుగులని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రశాంతి అండ్‌ కృష్ణ విజయ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ వైష్ణవి క్రియేషన్స్‌ పతాకంపై నారాయణరావు అట్లూరి భారీ పబ్లిసిటీ, ప్రమోషన్‌తో ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో ‘నీది నాది ఒకే కథ’ చిత్రాన్ని మార్చి 23న గ్రాండ్‌గా రిలీజ్‌ చేశారు.

రిలీజైన ఫస్ట్‌ షో నుండే యునానిమస్‌ హిట్‌ టాక్‌తో ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ దిశగా పయనిస్తోంది. ఈ చిత్రాన్ని ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్‌ తెలపడానికి చిత్రయూనిట్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. మార్చి 25 హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, వి.ఎన్‌. ఆదిత్య, జి.నాగేశ్వర్‌ రెడ్డి, మదన్‌, పవన్‌ సాదినేని, విరించి వర్మ, సాగర్‌ చంద్ర, కిషోర్‌ తిరుమల, దేవిప్రసాద్‌, ప్రముఖ నిర్మాతలు రాజ్‌ కందుకూరి, బెక్కం వేణుగోపాల్‌, హీరోలు నారా రోహిత్‌, శ్రీవిష్ణు, చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల, శ్రీ వైష్ణవి క్రియేషన్స్‌ అధినేత నారాయణరావు అట్లూరి, సంగీత దర్శకుడు సురేష్‌ బొబ్బిలి, కెమెరామెన్‌ రాజ్‌ తోట, ఎడిటర్‌ బొంతల నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ – ”ఈ సినిమా టైటిల్‌ విని ఈరోజుల్లో ఇటువంటి సినిమాలు ఎవరు చూస్తారులే అనుకున్నాను. కానీ సినిమా రివ్యూస్‌ చూశాక సినిమా చూడాలనిపించింది. ఈ సినిమా చూశాక నా మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ఫస్ట్‌ ఇంతమంచి సినిమా నిర్మించిన నిర్మాతలకు దండం పెట్టాలనిపించింది. ఈ కథను ఒప్పుకోవడం సినిమాగా తీయడం చాలా గొప్ప విషయం. డైరెక్టర్‌కి ఫ్రీడమ్‌ ఇచ్చి కథని కథలాగా చాలా అద్భుతంగా ఈ సినిమా తీశారు. సురేష్‌ బొబ్బిలి ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌నిచ్చారు. లిరిక్స్‌ అన్నీ అర్థమయ్యేలా వున్నాయి. ఇంత మంచి సినిమా చేసిన దర్శక, నిర్మాతలను అభినందిస్తున్నాను” అన్నారు.

నారా రోహిత్‌ మాట్లాడుతూ – ”సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షులకు, సపోర్ట్‌ చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా థాంక్స్‌. క్రిటిక్స్‌ అందరూ మంచి రివ్యూస్‌ రాశారు. ఇండస్ట్రీ నుండే కాకుండా బయట నుండి కూడా చాలామంది మంచి సినిమా తీశారని అప్రిషియేట్‌ చేస్తున్నారు. సినిమా 40 థియేటర్స్‌ పెరిగాయి. ఇంకా బెటర్‌ స్టేజ్‌కి వెళ్తుందని నా ఫీలింగ్‌. మా ఆరాన్‌ మీడియా వర్క్స్‌ బేనర్‌లో ఇంత మంచి సినిమాని ఇచ్చిన ప్రశాంతి, కృష్ణ విజయ్‌, శ్రీవిష్ణు, వేణులకు స్పెషల్‌ థాంక్స్‌. సురేష్‌ బొబ్బిలి మ్యూజిక్‌, రాజ్‌ తోట కెమెరా వర్క్‌ స్పెషల్‌ ఎస్సెట్‌గా నిలిచింది. కొత్తదనం వున్న కథలతో మా బేనర్‌లో మరిన్ని సినిమాలు వస్తాయి. ఈరోజుల్లో ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు? అని చెప్పారు. అయినా నా డబ్బు, నా ఇష్టం. నాకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వారందరికీ నా థాంక్స్‌” అన్నారు.

దర్శకుడు మదన్‌ మాట్లాడుతూ – ”ఈ చిత్ర దర్శకుడు వేణు గత 12 సంవత్సరాలుగా నాకు పరిచయం. నా సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశాడు. ఎన్ని కష్టాలు వచ్చినా రాజీ పడని మనస్తత్వం అతనిది. అది ఈ సినిమాలో పూర్తిగా కనిపించింది. శ్రీవిష్ణు లాస్ట్‌ వన్‌ అవర్‌ తన స్టన్నింగ్‌ పెర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకులందర్నీ కంటతడి పెట్టించాడు. వేణు తన కన్విక్షన్‌తో చెప్పాలనుకున్న పాయింట్‌ని పర్‌ఫెక్ట్‌గా చెప్పాడు. ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌ సినిమాలు చేయడానికి నాలాంటి దర్శకులందరికీ కొత్త ఉత్సాహాన్ని కలిగించింది” అన్నారు.

దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ – ”సినిమా స్టార్ట్‌ అయిన దగ్గర్నుండీ జనం అరుస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. సినిమా చూస్తున్నంత సేపూ నాకు దర్శకుడు, శ్రీవిష్ణులే కన్పించారు. దేవిప్రసాద్‌ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తున్నారు. చాలా పెద్ద హిట్‌ అవుతుంది. ఈ సినిమాని నారాయణరావు అట్లూరి తీసుకొని గ్రాండ్‌గా రిలీజ్‌ చేశారు. నెక్స్‌ట్‌ ఆయన రోహిత్‌తో ‘శబ్దం’ చిత్రాన్ని చేస్తున్నారు. టైటిల్‌ చాలా బాగుంది” అన్నారు.

దర్శకుడు వి.ఎన్‌. ఆదిత్య మాట్లాడుతూ – ”నారా రోహిత్‌ ‘బాణం’ సినిమా చూసి సర్‌ప్రైజ్‌ అయ్యాను. తర్వాత ఆయన ‘అసుర, ప్రతినిధి, అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి డిఫరెంట్‌ సినిమాలు చేసి సక్సెస్‌ అయ్యారు. కథను నమ్మి కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ ఆయన ఆరాన్‌ మీడియా వర్క్స్‌ బేనర్‌లో మంచి కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీస్‌ తీయడం చాలా గొప్ప విషయం. ఈ సినిమా పోస్టర్స్‌, ట్రైలర్స్‌ రిలీజైన దగ్గర్నుండీ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఎదురు చూశాను. రిలీజయ్యాక సినిమా చూశాను.

చాలా బాగుంది. వేణు నాకు ఇష్టమైన డైరెక్టర్‌. సినిమా చూస్తున్నంత సేపూ నాకు బాలచందర్‌గారే గుర్తుకు వచ్చారు. అంత అద్భుతంగా వేణు చిత్రాన్ని తీశాడు. దేవిప్రసాద్‌ మంచి డైరెక్టరే కాదు.. మంచి కళాకారుడు కూడా. తన నటనతో ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఇది ప్రేక్షకులు వారందరికీ ఇచ్చిన ఘన విజయం” అన్నారు.

ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ – ”ఈ సినిమాతో శ్రీవిష్ణు బిగ్‌ స్టార్‌ అయ్యాడు. సినిమా స్పెల్‌ బౌండ్‌ చేసింది. ఆరాన్‌ మీడియా కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ మంచి సినిమాలు నిర్మిస్తోంది. నారా రోహిత్‌ ఎంతో ధైర్యంతో సినిమాలు చేస్తున్నారు. వేణు ఎక్స్‌ట్రార్డినరీగా ఈ సినిమా తీసి ఆరాన్‌ మీడియా బేనర్‌కి గొప్ప హిట్‌ ఇచ్చారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు, దర్శకుడు దేవిప్రసాద్‌ మాట్లాడుతూ – ”ఓ రెండు కథలను రెడీ చేసుకొని అవి ట్రాక్‌ ఎక్కించే పనిలో వుండగా వేణు ఈ చిత్ర కథ చెప్పాడు. కథ విని చాలా ఎగ్జైట్‌ అయ్యాను. నా క్యారెక్టర్‌ నచ్చి ఈ సినిమా చేశాను. సినిమా చూసి ఎక్కడెక్కడ నుండో ఫోన్‌లు చేస్తూ సినిమా చాలా బాగుందని అప్రిషియేట్‌ చేస్తున్నారు. ఇంత మంచి కథతో సినిమా తీసిన ఆరాన్‌ మీడియా వారికి, దర్శకుడు వేణుకి నా కృతజ్ఞతలు. ఈ సినిమా నేను చేయకపోయుండుంటే జీవితంలో ఒక గొప్ప గౌరవాన్ని మిస్‌ అయ్యేవాణ్ణి. నాకు ఈ గౌరవ, మర్యాదలు వస్తున్నాయంటే అవన్నీ దర్శకుడు వేణుకే చెందుతాయి” అన్నారు.

హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ – ”చిన్న సినిమాలు, కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీస్‌ చేస్తున్నప్పుడల్లా ప్రేక్షకులు, మీడియావారు ఆదరిస్తూ మమ్మల్ని ఎంకరేజ్‌ చేస్తున్నారు. వారందరికీ నా ధన్యవాదాలు. ప్రశాంతి, కృష్ణ విజయ్‌ ఈ చిత్ర కథ విని సినిమా చేద్దామని డిసైడ్‌ అయ్యాం. రోహిత్‌గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. ఈ టైటిల్‌ ఏ ముహూర్తాన వేణు పెట్టాడో గానీ టైటిల్‌ వినగానే ష్యూర్‌ షాట్‌ హిట్‌ అన్పించింది. ప్రతి ఒక్కరూ ఇది నా కథ, మా ఇంట్లో జరిగిన కథ అని ఓన్‌ చేసుకుంటున్నారు. సినిమా చాలా బాగుందని అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి పెద్ద సక్సెస్‌ చేశారు. ఈ సక్సెస్‌ని ఎలా కొలమానంగా తీసుకోవాలో అర్థం కావడం లేదు. మా యూనిట్‌ అంతా చాలా ఎంజాయ్‌ చేస్తున్నాం. ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్‌” అన్నారు.

శ్రీ వైష్ణవి క్రియేషన్స్‌ అధినేత నారాయణరావు అట్లూరి మాట్లాడుతూ – ”రోహిత్‌గారితో మా బేనర్‌లో ‘శబ్దం’ అనే సినిమాని రీసెంట్‌గా స్టార్ట్‌ చేశాను. ఆయనను కలిసినప్పుడు ఈ సినిమా గురించి అడిగాను. రీ-రికార్డింగ్‌ లేకుండా ‘నీది నాది ఒకే కథ’ సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. బేసిక్‌గా నేను ఎమ్మెస్సీ సైన్స్‌ లెక్చరర్‌ని. అయినా సినిమా మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చాను. ఈ సినిమా చూడగానే వెంటనే రిలీజ్‌ చెయ్యాలనిపించింది. రోహిత్‌గారు, ప్రశాంతి, కృష్ణ విజయ్‌ నా మీద నమ్మకంతో ఈ సినిమాని నాకు ఇచ్చారు. ఈ సినిమా స్టార్టింగ్‌ నుండి రిలీజ్‌ వరకు రోహిత్‌గారు పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అయి వర్క్‌ చేశారు. సినిమా చాలా బాగుంది అని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా ఏ రేంజ్‌కి వెళ్తుందో చూడాలి. చిత్రాన్ని సక్సెస్‌ చేసిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు” అన్నారు.

చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ – ”ఫస్ట్‌ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రోహిత్‌గారికి, శ్రీవిష్ణు, ప్రశాంతి, కృష్ణ విజయ్‌లకు జీవితాంతం రుణపడి వుంటాను. రివ్యూస్‌ అన్నీ చాలా బాగున్నాయి. కొన్ని విమర్శలు కూడా వున్నాయి. అవన్నీ సరిదిద్దుకొని నెక్స్‌ట్‌ మంచి సినిమా తీయడానికి కృషి చేస్తాను. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here