రివ్యూ: యాత్ర
నటీనటులు: మమ్ముట్టి, రావు రమేష్, సుహాసిని, పోసాని, పృథ్వీ తదితరులు
సంగీతం: కృష్ణ కుమార్
నిర్మాణం: 70 ఎంఎం ఎంటర్ టైన్మెంట్స్
దర్శకుడు: మహి వి రాఘవ్
యాత్ర సినిమా గురించి జగన్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఈ చిత్రం వస్తుండటంతో ఆయనతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా చూస్తున్నారు. మరి యాత్ర వాళ్ల అంచనాలు అందుకుందా లేదా..?
కథ..
రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు.. ఓటమి ఎరుగని నాయకుడు అయినా కూడా ప్రభుత్వంలోకి మాత్రం రాడు.. అయితే చివరి అవకాశంగా 2004 ఎన్నికలు వస్తాయి. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి.. దాంతో పాటు ప్రజల కష్టాలు తెలుసుకోడానికి పాదయాత్రకు బయల్దేరతాడు. ఆయన తీసుకున్న నిర్ణయాలు పార్టీని అఖండ విజయం వైపుగా నడిపిస్తాయి.. అప్పుడు ఏం జరిగింది.. పార్టీలో ఆయనకు ఎదురైన కష్టాలేంటి అనేది అసలు కథ..
కథనం..
వైయస్సార్.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.. ఎన్టీఆర్ తర్వాత మహానాయకుడు అంటే వెంటనే గుర్తొచ్చే మరోపేరు రాజశేఖర్ రెడ్డి. ఆయన బయోపిక్ అంటే ఏముంటుందో.. ఏం చూపించారో అనే ఆసక్తితోనే థియేటర్లోకి వెళ్తారు ప్రేక్షకులు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు గెలిచాడు..
ముఖ్యమంత్రి అయ్యాడు.. ఈ మూడు ముక్కలే తెలుసు చాలా మందికి తెలిసింది. కానీ ఈ సినిమాలో మాత్రం పాదయాత్ర చేయడానికి గల కారణాలు… అప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు.. ప్రజలు పడిన కష్టాలు.. అన్నీ ఎంతో ఎమోషనల్ గా చూపించాడు దర్శకుడు మహీ వి రాఘవ్. ముఖ్యంగా పాదయాత్రకు ముందు రాజశేఖర్ రెడ్డిలో ఉన్న ఆవేశం.. ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఆయన మారిపోయిన విధానాన్ని చాలా చక్కగా ఆవిష్కరించాడు దర్శకుడు. రాజశేఖర్ రెడ్డి హయాంలో వచ్చిన కొన్ని ప్రభుత్వ పథకాలు ఎలా రూపుదిద్దుకున్నాయో ఎమోషనల్ సీన్స్ తో కనెక్ట్ చేసి.. మనసుకు హత్తుకునేలా తెరకెక్కించాడు మహీ. వైఎస్ బయోపిక్ అంటే కేవలం ఆయనలో ఉన్న ప్లస్ లు మాత్రమే కాకుండా..
మైనస్ లు కూడా చూపించాడు దర్శకుడు. ఇక కాంగ్రెస్ పార్టీతో.. హై కమాండ్ తో ఆయన ఎలా ఉండేవాడో అప్పట్లో పత్రికలు చదివే వాళ్ళం.. అది కూడా ఏమీ దాచి పెట్టకుండా ఉన్నదున్నట్లు చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు మహీ రాఘవ. మధ్యలో అప్పటి అధికార పార్టీపై కూడా కొన్ని సెటైర్లు వేసాడు దర్శకుడు. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించలేదు.. జీవించాడు.. ఇక మిగిలిన పాత్రల్లో కూడా అందరూ చక్కగా ఒదిగిపోయారు.. ఓవరాల్ గా వైయస్ అభిమానులకు ఈ చిత్రం ఒక పండగ.. మామూలు ప్రేక్షకులకు కూడా ఎమోషనల్ జర్నీ ఆఫ్ వైఎస్ఆర్.
నటీనటులు..
వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించలేదు జీవించాడు. ఆయన తప్ప ఇంకెవరు ఆ పాత్రలో అంత బాగా సరిపోయేవారు కాదేమో అనిపించింది. ముఖ్యంగా డబ్బింగ్ కూడా చక్కగా సరిపోయింది. వైఎస్ హావభావాలను కూడా చక్కగా అవపోసన పట్టాడు మమ్ముట్టి. ఇక ఆయన తర్వాత వైఎస్ ఆత్మగా పేరు తెచ్చుకున్న పివిపి పాత్రలో రావు రమేష్ చక్కగా నటించాడు. చేవెల్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని మణిరత్నం.. గౌరు సుచరితారెడ్డి పాత్రలో అనసూయ నటించారు. మిగిలిన వాళ్ళు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు..
సాంకేతిక నిపుణులు..
యాత్ర సినిమాకు అద్భుతమైన సంగీతం అందించాడు కృష్ణ కుమార్. నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా కుదిరింది. సందర్భానుసారంగా వచ్చే పాటలు సినిమాలోని ప్రాముఖ్యతను చూపించాయి. కథలో కలిసిపోయాయి. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు మహీ రాఘవ అద్భుతమైన పనితీరు ఈ చిత్రంలో కనిపించింది. వైయస్ రాజశేఖర్రెడ్డిలో ఉన్న మంచితనంతో పాటు మొండితనాన్ని కూడా తెరపై ఆవిష్కరించాడు. ఎమోషనల్ డ్రామాగా యాత్ర సినిమాను తెరకెక్కించాడు. దర్శకుడిగా ఆయన నూటికి నూరు మార్కులు సంపాదించాడు.
చివరగా..
ఎమోషనల్ జర్నీ ఆఫ్ వైఎస్ఆర్..