CRITICS METER
Average Critics Rating: 0
Total Critics:0
Average Critics Rating: 0
Total Critics:0
రివ్యూ: గాయత్రి
నటీనటులు: మోహన్ బాబు, విష్ణు, శ్రీయ, శివప్రసాద్, నాగినీడు తదితరులు
దర్శకుడు: మదన్
స్క్రీన్ ప్లే: ఎం మోహన్ బాబు
నిర్మాత: లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
మోహన్ బాబు నుంచి సినిమా వచ్చి చాలా కాలమైంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఇప్పుడు పెద్దగా అంచనాలుండేవి కావు. కానీ గాయత్రి మాత్రం భిన్నం. ఎందుకో తెలియదు కానీ ఈ చిత్ర ట్రైలర్స్.. టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచేసాయి. మరి వాటిని గాయత్రి నిలబెట్టిందా..?
కథ:
శివాజీ(మోహన్ బాబు) స్టేజ్ ఆర్టిస్ట్. ఆయనకు చిన్నప్పట్నుంచీ నటన అంటే ప్రాణం. ఎన్నో నాటకాల్లో నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటాడు. కానీ జీవితంలో అన్నీ కోల్పోతాడు. పుట్టినపుడే పుట్టిన బిడ్డను దూరం చేసుకుని బాధ పడుతుంటాడు. బిడ్డ రూపంలోనే అనాథలను చూసుకుంటూ.. శరణాలయాలను నడుపుతుంటాడు. డబ్బు కోసం మారు వేషాల్లో నటిస్తూ.. చేయని నేరాలకు జైలుకు వెళ్తుంటాడు శివాజీ. అతడి గుట్టు రట్టు చేయడానికి జర్నలిస్ట్ శ్రేష్ట(అనసూయ) ఫాలో అవుతుంది. ఆమెకు దొరక్కుండా తిరుగుతుంటాడు శివాజీ. అనుకోని పరిస్థితుల్లో ఓసారి శ్రేష్టకు దొరికిపోతాడు శివాజీ. ఆ లోపు తప్పిపోయిందనుకున్న తన కూతురు గాయత్రి(నిఖిలా విమల్) గురించి తెలుసుకుంటాడు శివాజీ. పాతికేళ్ల తర్వాత కూతుర్ని కలిసే సమయానికి గాయత్రి పటేల్(మోహన్ బాబు) శివాజీ జీవితంలోకి వస్తాడు. శివాజీని కిడ్నాప్ చేస్తాడు. ఇంతకీ శారద(శ్రీయ) ఎవరు.. శివాజీతో ఆమెకేంటి సంబంధం..? ఎందుకు శివాజీని గాయత్రి పటేల్ కిడ్నాప్ చేస్తాడు అనేది మిగిలిన కథ..
కథనం:
ఒకప్పుడు మోహన్ బాబు సినిమాలంటే ఆసక్తి ఉండేది.. కొన్నేళ్లుగా అది కనిపించట్లేదు. చాలా ఏళ్ల తర్వాత గాయత్రి సినిమాపై అది కనిపించింది. దానికి తగ్గట్లే సినిమాకు ప్రమోషన్ కూడా చేసుకున్నాడు కలెక్షన్ కింగ్. మొదట్నుంచీ ఈ చిత్రంలో ఏదో ఉందనేలాగే విజువల్స్ కూడా బాగానే ఆకట్టు కున్నాయి. ఇందులో గాయత్రి పటేల్.. శివాజీగా మోహన్ బాబు అద్భుతంగా నటించాడు. తొలి సీన్ నుంచే మోహన్ బాబు కథను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ప్రతీ సీన్ ఆయన చుట్టూనే తిరిగింది. ఈ ఏజ్ లో కూడా ఫైట్స్ చాలా బాగా చేసాడు కలెక్షన్ కింగ్. పైగా చాలా ఏళ్ళ తర్వాత పర్ ఫెక్ట్ విలన్ గా రప్ఫాడించాడు కలెక్షన్ కింగ్. ఆయన నటనకు పేరు పెట్టలేం.. కానీ కథలో అంత దమ్ము లేకపోవడం మైనస్. పైగా యంగ్ మోహన్ బాబు పాత్రలో విష్ణు ఫ్లాష్ బ్యాక్ సినిమాకు పెద్దగా హెల్ప్ కాలేదు. ఈ పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉంటే బాగుండేది. మోహన్ బాబు ఉన్నపుడు ఉండే టెంపో విష్ణు పాత్రలో కనిపించలేదు. ఫస్టాఫ్ లో కథ లేకపోవడంతో ఇంటర్వెల్ వరకు గాయత్రి సాగతీతే. పొలిటికల్ సెటైర్లు.. ముఖ్యంగా టిడిపిపై చాలా సెటైర్లు వేసాడు మోహన్ బాబు. చంద్రబాబునాయుడును ఇన్ డైరెక్టుగా టార్గెట్ చేసాడు కలెక్షన్ కింగ్. సెకండాఫ్ లో విలన్ గాయత్రి పటేల్ గా మోహన్ బాబు ఎంట్రీతో ఆసక్తి పెరుగుతుంది. కానీ అక్కడ్నుంచి కూడా పడుతూ లేస్తూనే సాగింది గాయత్రి ప్రయాణం. కథ సీరియస్ గా సాగుతున్న సమయంలో పాటలు రావడం కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. క్లైమాక్స్ అరగంట మాత్రం తన నటనతో అదరగొట్టాడు మోహన్ బాబు. సెకండాఫ్ మొత్తం ఇదే టెంపోతో ఉండుంటే ఫలితం మరోలా ఉండేది. మోహన్ బాబు అభిమానులకు గాయత్రి బాగానే అలరిస్తుంది.
నటీనటులు:
మోహన్ బాబు నటన గురించి కొత్తగా చెప్పేదేం లేదు. ఈయన నటుడిగా 560 సినిమాలు చేసాడు. ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు. గాయత్రి పటేల్ గా విశ్వరూపం చూపించాడు. యంగ్ మోహన్ బాబుగా విష్ణు నటించాడు. కాకపోతే ఈ పాత్రకు ఆయన సరిపోలేదేమో అనిపించింది. ఇక శ్రీయ పర్లేదు. శివాజీ కూతురు గాయత్రిగా నిఖిలా విమల్ చాలా బాగా నటించింది. ఆమెకు మంచి పాత్ర పడింది. ఇక జర్నలిస్ట్ గా అనసూయ కీలకపాత్రలో నటించింది. మిగిలిన వాళ్లంతా ఓకే..
టెక్నికల్ టీం:
థమన్ సంగీతం పర్లేదనిపించాడు. ఒకనువ్వు ఒకనేను పాట బాగుంది. విజువల్ గా కూడా చాలా బాగా తెరకెక్కించాడు మదన్. ఇక సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ బాగుంది. రీమేక్ కథనే తీసుకుని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్చాడు మదన్. స్క్రీన్ ప్లే సాయం మోహన్ బాబు కూడా చేసాడు. కానీ అది అంత ఆసక్తికరంగా అనిపించలేదు. సెకండాఫ్ పర్లేదు అనిపించినా.. ఫస్టాఫ్ మాత్రం తేలిపోయింది.
చివరగా:
గాయత్రి పటేల్ అదుర్స్.. కొంచెం ఇష్టం కొంచెం కష్టం..