శ్రీకారం చుట్టుకున్న బెస్ట్ విన్ ప్రొడక్షన్స్ “రుణం”

జీవితంలో ప్రతి మనిషి ఎవరికో ఒకరికి ఋణపడుతూ ఉంటాడు. అది గుర్తు పెట్టుకొని తీర్చేవాడు మనిషవుతాడు. అత్యాశ మనిషిని ఎంత దూరం అయినా తీసుకువెళ్తుంది. ఒక్కోసారి అది జీవితాన్ని గొప్ప స్థాయిలో నిలుపుతుంది. ఒక్కోసారి అథ పాతాళానికి తొక్కుతుంది. అత్యాశ వల్ల జరిగే అనర్ధాన్ని అత్యంత వినోదాత్మకంగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాం “రుణం” చిత్రంతో అంటున్నారు చిత్ర దర్శకులు ఎస్.గుండ్రెడ్డి. బెస్ట్ విన్ ప్రొడక్షన్ పతాకంపై భీమినేని సురేష్-జి.రామకృష్ణారావు సంయుక్తంగా నిర్మిస్తున్న “రుణం”చిత్రంలో గోపికృష్ణ-మహేంద్ర హీరోలుగా పరిచయమవుతుండగా.. శిల్ప-తేజు-ప్రియాంక హీరోయిన్లుగా నటిస్తున్నారు.
సంస్థ కార్యాలయంలో.. పూజా కార్యక్రమాలు జరిపిన అనంతరం.. ఫిల్మ్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. చిత్ర నిర్మాతలు భీమినేని సురేష్-జి.రామకృష్ణారావు, చిత్ర సమర్పకులు గాలిరెడ్డి,  దర్శకుడు ఎస్.గుండ్రెడ్డి, హీరోలు గోపికృష్ణ-మహేంద్ర, హీరోయిన్ ప్రియాంక, విలన్ పాత్రధారి ప్రదీప్ ప్రత్తికొండ, సంగీత దర్శకుడు ఎస్.వి.మల్లిక్ తేజ పాల్గొన్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ప్రారంభించి.. సింగిల్ షెద్యూల్ లో “రుణం” షూటింగ్ పూర్తి చేయనున్నామని నిర్మాతలు తెలుపగా.. ఈ చిత్రం ద్వారా హీరోలుగా పరిచయం చేస్తున్న దర్శక నిర్మాతలకు ఎప్పటికీ రుణ పడి ఉంటామని హీరోలు పేర్కొన్నారు. హిందీలో ఒకటి, కన్నడలో నాలుగు సినిమాలు చేసిన తనను “రుణం” చిత్రంతో తెలుగులో దర్శకుడిగా పరిచయం చేస్తున్న నిర్మాతలకు దర్శకుడు ఎస్.గుండ్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వినోదానికి పెద్ద పీట వేస్తూ.. మానవ సంబంధాలు, మనస్తత్వాల నేపథ్యంలో రూపొందుతున్న”రుణం” సాధించబోయే విజయంపై తమకు పూర్తిగా నమ్మకం ఉందన్నారు.
ఏ.వెంకట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: భీమినేని సురేష్-జి.రామకృష్ణారావు, కథ-స్క్రీన్ ప్లే-సంభాషణలు-దర్శకత్వం: ఎస్.గుండ్రెడ్డి!!