“సోగ్గాడే చిన్ని నాయన” కంటే “రాజుగారి గది 2” పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున

పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్, ఓక్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “రాజుగారి గది 2”. అక్కినేని నాగార్జున, అక్కినేని సమంతలు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఓంకార్ దర్శకుడు. శుక్రవారం (అక్టోబర్ 13) విడుదలైన ఈ చిత్రం సూపర్ పాజిటివ్ టాక్ తో భారీ వర్షాలను సైతం ఖాతరు చేయకుండా ఫెంటాస్టిక్ కలెక్షన్స్ తో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్ర విజయం అందిస్తున్న ఆనందాన్ని ప్రేక్షకులతో, మీడియాతో పంచుకోడానికి చిత్రబృందం సక్సెస్ మీట్ ను నేడు (అక్టోబర్ 15) సాయంత్రం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు నాగార్జున మాట్లాడుతూ.. “చాలారోజుల తర్వాత తృప్తిగా రెండు బీర్లు తాగి, చికెన్ బిర్యానీ తిని సంతోషంగా ఎంజాయ్ చేశాను. నిన్నమొన్నటివరకూ “రాజుగారి గది 2” మేకింగ్, నాగచైతన్య-సమంతల పెళ్లిలో చాలా బిజీగా ఉండిపోయాను. మా డైరెక్టర్ ఓంకార్, ప్రొడ్యూసర్స్ పివిపి అండ్ జగన్మోహన్ రెడ్డి, డైలాగ్ రైటర్ అబ్బూరి రవి నలుగురు పిల్లర్స్ లాంటివారు. మా అమ్మకు ఇష్టమైన ఒక జ్యోతిష్కుడు “నువ్వు కొత్త పాత్రలు పోషిస్తే సినిమా హిట్ అవుతుంది” అన్నారు. అది “రాజుగారి గది 2″తో మరోమారు ప్రూవ్ అయ్యింది. వర్షాలు పడుతున్నా కలెక్షన్స్ ఎక్కడా తగ్గలేదు. “సోగ్గాడే చిన్ని నాయన” కంటే పెద్ద హిట్ గా “రాజుగారి గది 2″ నిలుస్తుందని నమ్మకంగా చెప్పగలను” అన్నారు.
అక్కినేని సమంత మాట్లాడుతూ.. “తెలుగు ప్రేక్షకులు నాకు అందించిన పెళ్లి కానుక ఈ చిత్ర విజయం. మా మావయ్యగారి సినిమా పెద్ద హిట్ అవ్వాలని బలంగా కోరుకొన్నాను. నన్ను ఈ పాత్రకి సెలక్ట్ చేసుకొన్నందుకు ఓంకార్ గారికి, ఆ పాత్రను యాక్సెప్ట్ చేసే తెలివి ఇచ్చిన దేవుడికి కృతజ్నతలు. మామయ్య (నాగార్జున) క్లైమాక్స్ షూట్ లో చాలా హెల్ప్ చేశారు” అన్నారు.
దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ.. “మా “రాజుగారి గది 2″కి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు ఎప్పటికీ కృతజ్ణుడ్నై ఉంటాను. అక్కినేని నాగార్జున గారి అభిమానులు నాగార్జునగారి క్యారెక్టర్ ను రిసీవ్ చేసుకొన్న విధానం నాకు నచ్చింది. అలాగే.. సమంత అక్కినేని ఫ్యామిలీలోకి అడుగిడిన తర్వాత విడుదలైన మా చిత్రం సూపర్ హిట్ అవ్వడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. సినిమా విషయంలో కాస్త ఎక్కువ కేర్ తీసుకొన్నానని నాగార్జునగారు నన్ను సరదాగా “ఓసిడి” అనేవారు. నా అభిమాన హీరో అయిన నాగార్జునగారిని డైరెక్ట్ చేసే అవకాశం నాకు దక్కినప్పుడు ఆ మాత్రం ఎక్కువ జాగ్రత్త తీసుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి. మా సినిమా టీం మొత్తం ఇచ్చిన సపోర్ట్ వల్లే ప్రొజెక్ట్ అవుట్ పుట్ ఇంత అద్భుతంగా వచ్చింది. ఇక పివిపి బ్యానర్ కి హ్యాట్రిక్ హిట్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది” అన్నారు.
తమన్ మాట్లాడుతూ.. “చాలాకాలం తర్వాత నా బ్యాగ్రౌండ్ స్కోర్ కి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. సినిమాకి వర్క్ చేయడం కంటే.. మా సినిమాని ట్విట్టర్ లో అభినందిస్తున్నవారికి రిప్లైలు ఇవ్వడానికే ఎక్కువ కష్టపడ్డాను. ఓంకార్ ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇదంతా సాధ్యమైంది” అన్నారు.
నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ.. “రిలీజ్ కి ముందు నుంచే మేం సినిమా రిజల్ట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. నిన్న రాత్రి కూడా ఆడియన్స్ తో సినిమా చూశాం. లేట్ నైట్ షోకి కూడా లేడీ ఆడియన్స్ వస్తుండడం చాలా ఆనందంగా ఉంది. నాగార్జునగారితో మా సంస్థలో తీసిన “ఊపిరి” మొదటిరోజు నైజాంలో 80 లక్షలు వస్తే.. “రాజుగారు గది 2″ 1.40 కోట్ల షేర్ రావడం ఆనందంగా ఉంది” అన్నారు.
మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ తరుపున జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. “”రాజుగారి గది 2″ను ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అయితే.. సినిమా పైరసీని ఎవరూ ఎంకరేజ్ చేయకూడదని కోరుకొంటున్నాను” అన్నారు.
సీరత్ కపూర్ మాట్లాడుతూ.. “కొంత విరామం అనంతరం నాకు ఎంతగానో నచ్చి సెలక్ట్ చేసుకొన్న స్క్రిప్ట్ జనాలకి నచ్చడం, ఇంత పెద్ద హిట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. నన్ను నమ్మి ఈ అవకాశాన్నిచ్చిన ఓంకార్ గారికి ధన్యవాదాలు. నాగార్జునగారితో కలిసి నటించడం ఎప్పటికీ మరువలేని అనుభూతి. మా టీం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం సంతోషం” అన్నారు.
నటి అభినయ మాట్లాడుతూ (ఆమె బదులు సమంత ఆమె స్పీచ్ ను చదివారు).. “నాగార్జునగారితో “కింగ్, ఢమరుకం” తర్వాత నేను నటించిన మూడో సినిమా ఇది. ఓంకార్ గారు నన్ను ఈ చిత్రంలో క్యాస్ట్ చేసుకోవడం ఎప్పటికీ మరువలేను. సమంత అభిమానులందరూ నాపై చాలా కోపంగా ఉన్నారు (నవ్వుతూ)” అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించిన అశ్విన్ బాబు, ప్రవీణ్ మరియు ఇతర చిత్ర బృందం “రాజుగారి గది 2” విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.