ఈనెల 16న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ‘రచయిత’

దుహర మూవీస్ పతాకంపై విద్యాసాగర్ రాజు, సంచిత పడుకొనే జంటగా నటించిన చిత్రం ‘రచయిత’. ఈ చిత్ర హీరోనే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కల్యాణ్ ధూళిపాళ్ల నిర్మాత. ఈ చిత్రం ఈనెల 16న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తో పాటు.. ప్రముఖ నిర్మాత, రంజిత్ మూవీస్ అధినేత దామోదర ప్రసాద్, మరో నిర్మాత రాందాస్ సినిమా విశేషాలను మీడియాకు వివరించారు.
ఈ సందర్భంగా దామోదర ప్రసాద్ మాట్లాడుతూ ‘రచయిత  సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాను పబ్లిక్ కు చూపించాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్కరూ సినిమాను మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాను రంజిత్ మూవీస్ డిస్ట్రిబ్యూషన్లో నైజాం ఏరియాలో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా విడుదల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ చిత్ర నిర్మాత. మొదట్లో చిన్న సినిమాల విడులలో చాలా ఇబ్బందులున్నాయని అంటే.. ఏంటో అనుకున్నా. ఇప్పుడు అనుభవ పూర్వకంగా తెలిసింది. దాంతో ఈ సమస్యను ఎలాగైనా తోటి నిర్మాతలతోనూ, థియేటర్ల ఓనర్లతోనూ మాట్లాడి పరిష్కరించడానికి ట్రై చేస్తా. ఇది ప్యూర్ తెలుగు సినిమా. చంద్రబోస్ మంచి లిరిక్స్ అందించారు. చాలా బాగున్నాయి పాటలు. ఈ చిత్ర నిర్మాత కళ్యాణ్ ఎంతో శ్రమించి సినిమాను తెరకెక్కించారు. హీరో కొత్తవాడైనా.. నిర్మాత ప్రోత్సహించి ఈ సినిమాను నిర్మించినందుకు అభినందించాలి. ఈ సినిమాకోసం హీరో జగపతిబాబు చాలా శ్రమించారు. ఆయన వైజాగ్, విజయవాడ, ప్రకాశం జిల్లాల్లో వాక్ చేసి.. సినిమాను గ్రాండ్ సక్సెస్ చేయాలని ప్రచారం చేశారు. ఆయన్ను నిజంగా అబినందించాలి. తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుందని’ తెలిపారు.
మరో నిర్మాత రామదాసు మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని గత నెలలోనే రిలీజ్ చేయాల్సి వుంది. అయితే థియేటర్లు లేక రిలీజ్ చేయలేదు. ఈనెల 16న రిలీజ్ చేసుకోవాలని కొంత మంది థియేటర్ల యజమానులు సూచించారు. తీరా..ఈ తేదీకైనా సినిమాను రిలీజ్ చేద్దాం అంటే.. థియేటర్లు లేవని మెలిక పెట్టారు. చివరకు అందరితో మాట్లాడి.. డీసెంట్ రిలీజ్ చేస్తున్నాం. చిన్న చిత్రాలను ప్రోత్సహించడానికి మా వంతు దామోదర ప్రసాద్ తో కలిసి కృషిచేస్తున్నాం’ అన్నారు.
చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘సినిమా నిర్మించడం ఒక ఎత్తు. దానిని రిలీజ్ చేయడం ఒక ఎత్తని ఈ సినిమా రిలీజ్ విషయంలో నాకు తెలిసింది. ఎన్నో అడ్డంకులను అధిగమించడానికి నిర్మాత దామోదర ప్రసాద్, రామదాసు, హీరో జగపతి బాబు కృషి చేశారు. వారికి ధన్యవాదాలు. చిన్న సినిమా అయినా చాలా రిచ్ గా నిర్మించాం. వైజాగ్ లో కొండమీద వేసిన సెట్టింగ్ చాలా బాగుంది. సినిమా కూడా బాగా వచ్చింది. తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు.
ఈ సినిమా హీరో, దర్శకుడు విద్యాసార్ రాజు మాట్లాడుతూ ‘ఈ చిత్రం ఎమోషన్ థ్రిల్లింగ్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఒక అమ్మాయి మనసు డెప్త్ ఎంత వుంటుందో ఇందులో చూపించాం. చంద్రబోస్ అందించిన మూడు పాటలకు లిరిక్స్ చాలా బాగున్నాయి. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమాకు నన్ను నమ్మి ఖర్చు పెట్టారు. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది’ అన్నారు.
 రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ ‘దర్శకుడు కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యా. కథకు అనుగుణంగా అన్ని పాటలకు నేనే సాహిత్యం అందించే అవకాశం ఇచ్చారు నిర్మాత. ఆయన సలహాలు, సూచనల మేరకు మంచి సాహిత్యం అందించా. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది. భవిష్యత్తులో నిర్మాత మరిన్ని మంచి చిత్రాలను నిర్మించాలి. ఈ సినిమా విడుదలలో సహకరించిన నిర్మాత దామోదర ప్రసాద్ గారికి ధన్యవాదాలు’ అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ సంచిత పడుకొనే తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here